YSR
వైఎస్ రాజశేఖర రెడ్డి.....
గాంధీ సిద్ధాంతాలను మనసా,వాచా,కర్మణా నమ్మి ఆచరించే వైఎస్ నాటి స్వాతంత్య్రోద్యమంలో కూడా గాంధీ, నెహ్రూల పల్లెబాటే స్ఫూర్తిగా తీసుకున్నారు. దాదాపు 1700 కిలోమీటర్ల దూరాన్ని తన ఆరోగ్యాన్ని సైతం లెక్కచేయక మండుటెండలో చెమటోడ్చి సాగించారు. ఊరుఊరిలో ప్రజలమధ్య మమేకమై తిరుగుతూ అక్కడి జనాల బాధలను స్వయంగా తెలుసుకున్నాడు. ప్రజల అవసరాలను బాగా అర్థం చేసుకున్నాడు. ఆ పాదయాత్రల అంతరంగం నుంచి పుట్టుకొచ్చినవే ఆయన ప్రవేశపెట్టిన ప్రజాకర్షక పథకాలు. ప్రజాకర్షక పథకాలు అనేకన్నా వాటిని ప్రజోపయోగ పథకాలు అంటే బాగుంటుందేమో. రెండు రూపాయల పథకం ఎన్టీఆర్ ప్రవేశపెట్టి విజయవంతంగా అమలుచేశారు. తర్వాత వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం అటువంటి పథకాలను పెద్దగా పట్టించుకోలేదు.
వైఎస్ కేంద్రాన్ని మభ్యపెడుతున్నారని ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్కు డిపాజిట్లు కూడా దక్కేట్లు లేవని అధిష్టానానికి కొందరు తప్పుడు సంకేతాలు అందించారు. వైఎస్ అన్నింటికీ మౌనంగా విని ఓ చిరునవ్వు నవ్వేసేవారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్ ఊహించని రీతిలో అధికారపగ్గాలు చేపట్టింది. వైఎస్ను తిరుగులేని నాయకుని చేసింది. తన తొలి సంతకాన్ని తాను ఇచ్చిన మాటకు కట్టుబడి ఉచిత విద్యుత్ ఫైల్పై ప్రజాసమక్షంలో సంతకంచేశారు వైఎస్. ఎన్టీఆర్లానే తాను కూడా ఎల్బీ స్టేడియంలో ఏర్పాటుచేసిన సదస్సులో ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు.
నాడు ఎన్టీఆర్ తొలి సంతకాన్ని ఇదే స్టేడియంలో రెండురూపాయల బియ్యం పథకం ఫైల్మీద చేస్తే వైఎస్ ఉచిత విద్యుత్ ఫైల్పై సంతకం చేయడం విశేషం. ఆ తర్వాత మహిళలకు పావలా వడ్డీకే రుణాలు, ఆరోగ్యశ్రీ, జలయజ్ఞం, అభయహస్తం వంటి పథకాలను అమలుచేసి పేదల పక్షపాతి అయ్యారు. తను నమ్మిన సిద్ధాంతం కోసం కడదాకా పోరాడే మనిషి వైఎస్. కాంగ్రెస్కు పూర్వవైభవాన్ని సంతరించిపెట్టారు. గ్రూపుతగాదాలు, గొడవలు, ముఠాతత్వాలు, స్వార్థం, సంకుచిత్వం వంటి లక్షణాలతో ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకులు ఇగో ప్రదర్శించేవారు. వీళ్ల అనైక్యత చూసి ప్రజలందరికీ వెగటుకలిగింది. నాయకత్వలోపం ప్రస్ఫుటంగా కనిపించింది.
అలాంటి స్థితిలో వైఎస్ ఆపద్బాంధవుడల్లే పార్టీకి దిక్కయ్యారు. అందరినీ ఒక త్రాటిపైకి తెచ్చి అవసరమొస్తే కాంగ్రెస్వాదులంతా ఒక్కటే అనే నినాదాన్ని ఇచ్చి కార్యకర్తల్లో నూతనోత్సాహాన్ని రేకెత్తించారు. క్షేత్రస్థాయిలో పార్టీని పర్యవేక్షించి కిందిస్థాయి కార్యకర్తను కూడా భుజంమీద చెయ్యివేసి ఆప్యాయంగా దగ్గరకు తీసుకునేవారు. తనని నమ్మినవారిని కడదాకా గుర్తుంచుకునేవారు. తన ఆంతరంగిక మిత్రుడైన కెవీపీ రామచంద్రరావుకు సముచిత స్థానం కల్పించి అసలైన మైత్రీబంధానికి ప్రతీకగా నిలిచారు. తన తండ్రి స్వర్గీయ రాజారెడ్డికి అనుంగు అనుచరుడైన సూరిని తన ఆంతరంగిక అనుచరుడిగా దగ్గరే ఉంచుకుని కడదాకా తన వెన్నెంటే ఉంచుకున్న దయామయుడు వైఎస్. నమ్మితే ప్రాణం ఇవ్వడం వైఎస్ నైజం.

0 comments:
Post a Comment